
- News18 Telugu
- Last Updated: April 17, 2021, 10:53 IST
తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్ని పోలింగ్ కొనసాగుతుండగానే స్థానికంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా వైసీపీ దొంగ ఓట్లు వేసేందుకు యత్నిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు బీజేపీ కూడా ఇదే ఆరోపణలు చేస్తోంది. దీంతో మూడు పార్టీల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణం వేడెక్కిస్తున్నారు. ఆ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి పుంగనూరు వీరప్పన్ అని.. ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నట్లే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ విమర్శించారు. ఇక దొంగఓట్లు వేస్తున్నారంటూ పలుచోట్ల టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పూతలపట్టు నాయుడుపేట హైవేపైమల్లవరం జంక్షన్ నందు టిడిపి నాయకుల నిరసనకు దిగారు. ప్రైవేటు వాహనాలు మరియు స్కూల్ బస్సులలో లక్షల మందిని దైవదర్శనానికి అని చెబుతూ దొంగ ఓట్లు వేయడానికి వెళుతున్నట్లు టిడిపి నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
లోకేష్ ఆరోపణల విషయానికి వస్తే.. “పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి…, ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నట్టే! ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నాడు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి బయటి నుంచి తన ముఠాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నాడు. పెద్దిరెడ్డి మనుషులు 5 వేల మంది పెద్దిరెడ్డికే చెందిన పిఎల్ఆర్ కళ్యాణమండపంలో మకాం వేసి దొంగ ఓట్లు వేయడానికి వెళ్తుంటే టిడిపి నాయకులు అడ్డుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరిగిన పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో పోలీసులు..అధికార యంత్రాంగంతో ఎలక్షన్ జరగకుండా సెలక్షన్ చేయించుకున్న మంత్రి పెద్దిరెడ్డి..కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నికని అక్రమార్గంలో గెలవాలని నేరుగా తానే రంగంలోకి దిగారు. తిరుపతి ఉపఎన్నికలో రిగ్గింగ్, దొంగ ఓట్లతో నెగ్గాలని వేసిన ప్రణాళికని తెలుగుదేశం బట్టబయలు చేసింది. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించి పెద్దిరెడ్డి, వైసీపీ మంత్రుల్ని అదుపులోకి తీసుకోవాలి. దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల తరలివచ్చిన వేలాది మందిని అరెస్ట్చేసి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలి.” అని లోకేష్ డిమాండ్ చేశారు.
మరోవైపు దొంగ ఓట్ల వ్యవహారంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి విజయానంద్ తోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వేసేందుకు వైసీపీ నేతలు తిరుపతి పార్లమెంటు చుట్టుప్రక్కల ప్రాంతాలనుంచి బస్సుల్లో, లారీల్లో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలను తరలిస్తున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వైసీపీవారిని టీడీపీ శ్రేణులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారని తెలిపారు. దొంగ ఓట్లపై వెంటనే చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.