Andhra Pradesh: ఇంటర్ చదివి కరోనాకు వైద్యం చేస్తున్నాడు. ఆపరేషన్లూ చేస్తాడు. అసలు కథ ఏంటి?

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు కొందరు. కరోనా భయాన్ని తమ కాసుల కక్కుర్తి కోసం వాడుకుంటున్నారు. తమ దగ్గర వైద్యం చేసుకుంటే కరోనా ఇట్టే పోతుందని నమ్మిస్తున్నారు. అయితే ఇంటర్ చదివిన వ్యక్తి ఇలా వైద్యుడి అవతారం ఎత్తి అందరికీ షాక్ ఇచ్చాడు.

Andhra Pradesh: ఇంటర్ చదివి కరోనాకు వైద్యం చేస్తున్నాడు. ఆపరేషన్లూ చేస్తాడు. అసలు కథ ఏంటి?
ఇంటర్ చదివి కరోనాకు వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్

కరోనా వైరస్ ఎంతో మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చాలామంది అత్యవసర పనులను సైతం మానుకుని.. ఇంట్లోనే కూర్చుంటున్నారు. ప్రభుత్వాలు, అధికారులు సైతం కలవర పడుతున్నారు. ఇలా దేశం మొత్తాన్ని కరోనా కలవర పెడుతుంటే.. కొంతమంది దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ప్రజల భయాన్ని కాసుల కక్కుర్తి కోసం ఆసరాగా మార్చుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.

అసలే కరోనా కాటుతో ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. చిన్నపాటి అలసట వచ్చిన ఆసుపత్రిల బాట పడుతున్నారు. ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతంలో అత్యధికంగా ఇలాంటి డాక్టర్లు తిష్ట వేస్తున్నారు. వారైతే  ప్రశ్నించరు కాదా చెప్పినదానికి తల ఊపుతారు కదా అనే ఉద్దేశంతో వారి దగ్గర నుంచి 300 రూపాయల నుంచి ఐదు వందల వరకు గుంజుకుంటున్నారు వాసూలు రాజాలు. డ్రగ్ కంట్రోల్ బోర్డు అనుమతి ఇవ్వని.. మందులు, మాత్రలు, సూదులు వేస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రైవేట్ ప్రాక్టీషనర్ కానీ వారు కూడా పేరుకు ముందొక డాక్టర్ వెనుకోక ఎంఎంబిఎస్ అంటూ పెద్ద పెద్ద బోర్డులను పెట్టి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు.

తాజాగా ఓ నకిలీ వైద్యుడి గుట్టు రట్టైంది. కారోనా తగ్గాలంటే తన లాంటి వైద్యం ఎవరు ఏపీ వ్యాప్తంగా చేయలేరని ప్రజలను నమ్మిస్తున్నాడు. ఆ విషయం తీరా జిల్లా వైద్యాధికారుల చెవిని పడడంతో.. వెంటనే తనిఖీలు నిర్వహించి షాక్ తిన్నారు. ఎంబిబిఎస్ అని బోర్డు పెట్టుకున్న ఆ డాక్టర్ ఇంటర్ ఫెయిల్ అయ్యాడని తెలిసింది. దీంతో ఆ ఊరి ప్రజలంతా నోరెళ్లబెట్టారు. ఇంటర్ డాక్టర్ దగ్గరా మనం వైద్యం చేయించుకుంటున్నామని..

చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని చెరివి గ్రామంలో ఓ నకిలీ డాక్టర్ ఒక క్లీనిక్ ప్రారంభించాడు. తాను ఫారెన్ లో

డాక్టర్ చేసి పెద్ద డాక్టర్ చదువు చదివి పేదల కోసం ఇక్కడే వైద్య శాల ఏర్పాటు చేస్తున్నట్లు అందరి ముందు కటింగ్ ఇచ్చాడు. అతడు చెప్పిన మాటలకు అక్కడి అమాయక జనం బలైపోయారు. కానీ కనీస అర్హత లేకుండానే.. ఆపరేషన్స్ చేసి కుట్లు చకచకా వేసినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. కొన్ని సార్లు వారు చెప్పే రోగానికి చేసే వైద్యానికి సంబంధం ఉండేది కాదని.. కానీ తనకు అన్నీ తెలుసు అనేవాడని చెబుతున్నారు.

అలాగే మరో భయంకరమైన వాస్తవాలు కూడా బయటపడ్డాయి. నిషేధిత మందులు, సూదులు, నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ లోనే సిలైన్ బాటిల్స్ పెట్టడం చూసిన.. కొందరు స్థానిక యువతకు అతడి వ్యవహారంపై డౌట్ వచ్చింది. దీంతో వారు డ్రగ్ ఇన్స్పెక్టర్ కి పిర్యాదు చేసారు. ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ వెంటనే రంగంలోకి దిగి.. అతడు నిర్వహిస్తున్న కీర్తన హాస్పిటల్ లో సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో అసలు విషయాలు తెలియడంతో వెంటనే గౌతమ్ అలియాస్ గిద్దయ్య ను అదుపులోకి తీసుకుని సంబంధిత సర్టిఫికేట్స్ అడిగే సరికి మోహం తేలేశాడు.

తన దగ్గర ఎలాంటి సర్టిఫికెట్స్ లేవని కేవలం ఇంటర్ చదివానని చెప్పడంతో డ్రగ్ ఇన్స్పెక్టర్ నివ్వెరపోయారు. వెంటనే హాస్పిటల్ ను సీజ్ చేసి నకిలీ డాక్టర్ గా గుర్తించి, పోలీసులకు పిర్యాదుచేయాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశించారు. తరువాత ఆ హాస్పిటల్ లోని వైద్య పరికరాలు, టీకాలు, ఇతర వస్తువులను సీజ్ చేశారు. పదే పదే ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నా.. ప్రజలు మాత్రం అలాంటి వారి మాటలకు బలైపోతున్నారు. చేతి చమురు వదిలించుకోవడంతో పాటు.. ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.

Published by:Nagesh Paina
First published:April 20, 2021, 23:58 pm